విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
*సాంకేతిక రంగంలో స్వయం సంవృద్ధి సాదించాలని, స్వదేశీ సాంకేతిక ప్రగతి శరవేగంగా జరుగుతోందని డి.ఆర్.డి.ఓ డైరెక్టర్ జనరల్ (ఎన్.ఎస్ & ఎం) డాక్టర్ ఆర్.వి. హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్.ఎస్.టి.ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్. 2025 ను శుక్రవారం అయిన ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ వి. వార ప్రసాద్ మాట్లాడుతూ భారత్ నవతరం, భవిష్యత్ సాంకేతికతలపై పూర్తిస్థాయిలో పట్టు సాదించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా డ్రోన్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు* .
దేశీయంగా అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలు సమర్ధవంతంగా వినియోగించి సత్ఫలితాలను సాధించిన విధానాన్ని వివరించారు. డి.ఆర్.డి.ఒ సమిష్టిగా విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్యాసంస్థలతో కలసి పరిశోధనలు నిర్వహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 విద్యాసంస్థలకు చెందిన 500 మందికి
పైగా ప్రతినిదులు ఒకరోజు సదస్సులో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. భవిష్య సవాళ్లకు అనుగుణంగా మన దేశీయ సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. నీటి లోపల లోతైన ప్రదేశంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించే నూతన వ్యవస్థలు, స్టైల్త్ టెక్నాలజీ, సెన్సార్లు వంటివి దేశీయంగా అభివృద్ధి చేయడం, వినియోగించడం జరుగుతోందని తెలిపారు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, స్టార్ట్ అప్ లతో సమిష్టిగా పనిచేస్తే మరింత వేగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందని అన్నారు.
జలాంతర్గాములలో వినియోగిస్తున్న సెన్సార్లు, శత్రుదేశాలు గుర్తించలేని విధంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలు మన దేశ అవసరాలకు వినియోగించడం తో పాటు, విదేశాలకు ఎగుమతి చేసే దిశగా కూడా దేశం అడుగులు వేస్తోందని ఇప్పటికి పలు క్షిపణులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్న విధానం ప్రస్తావించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ళ మన చరిత్రను కలిగి ఉందని ఇటువంటి సందర్భంలో ఏయూ తో కలసి పనిచేసి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ఖ్యాతిని ఏ.యూ కలిగి ఉందని చెప్పారు.
*ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ సాంకేతికతలో స్వీయ వికాసం కలిగి ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి నూతన*
సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలో పెరగాలని సూచించారు. వికసిత్ భారత లక్ష్యాలను చేరుకోవాలంటే దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి విస్తృతంగా జరగాలని చెప్పారు. ఎన్ ఎస్ టి ఎల్ తో సంయుక్తంగా విద్యాసంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్ తరానికి అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు.
డి ఆర్ డి ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మను కోరుల్లా వర్చువల్ విధానంలో సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో 100 పేటెంట్లు సాధించడం లక్ష్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించే విభిన్న పరిశోధనల పలితాలు సమాజానికి ఉపయుక్తంగా నిలపాలని చెప్పారు. సాంకేతికతలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశాన్ని నిలపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విభిన్న వ్యవస్థలను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆవిష్కరణలు, నోబెల్ బహుమతులు సాధించడం వెనుక ఉన్న పరిశోధనలలో మన భారతీయులు భాగం కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎం ఎస్ టి ఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య టి.వి.కె భాను ప్రకాష్, ఏ.ఐ.ఓ-ఎన్.ఎస్.టి.ఎల్ శాస్త్రవేత్త విఎప్ సాజీ, డిప్యూటీ ఏ.ఐ.ఓ-శాస్త్రవేత్త టి. వేణుగోపాలరావు, డి.ఆర్.డి. ఓ శాస్త్రవేత్తలు రాజేష్ యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.
*ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఎన్.ఎస్.టి.ఎల్ కి సంబందించిన వివిధ ప్రాజెక్టులపై డి ఐ ఏ- సి ఓ ఈ సెషన్ నిర్వహించారు. ఎన్ ఆర్ బి అంశాలపై నిపుణులు ప్రసంగం చేశారు. మధ్యాహ్నం సెషన్ లో భాగంగా ఎన్.ఎస్.టి.ఎల్ కి సంబంధించిన వివిధ ప్రత్యేకమైన అంశాలను చర్చించారు* . *చివరగా సదస్సులో శాస్త్రవేత్తలు అందించిన ప్రసంగాలు, వివరించిన అంశాలకు అనుగుణంగా పలువురు ఆచార్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అందించారు.*


