విశాఖపట్నం, జూన్ 11 (పున్నమి ప్రతినిధి): ఇటీవల ఘోర ప్రమాదంతో విషాదంలో మునిగిన విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి ద్రవ ఉక్కు లీకేజీ ఘటన చోటుచేసుకోవడం కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 (ఎస్ఎంఎస్-1) విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీక్ అయినట్లు సమాచారం. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లీకేజీని గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 8న ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్ఎంఎస్-2)లో జరిగిన ఘోర ప్రమాదంలో ద్రవ ఉక్కు భారీగా లీకై పలువురు కార్మికులు సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఐదుగురు శాశ్వత ఉద్యోగులు, నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. పలువురు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ విషాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే మరోసారి ద్రవ ఉక్కు లీకేజీ చోటుచేసుకోవడం ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సమగ్ర భద్రతా సమీక్ష చేపట్టి ప్రమాదాలకు గల కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నాయి.



