పది రోజుల్లో చర్యలు చేపడతాం: డీఎస్పీ కే వేణుగోపాల్
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షఆర్డిఓ బి. పావని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో డియస్పి కే వేణుగోపాల్ పాల్గొని వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఫారెస్ట్, విపత్తుల నిర్వహణ, ఫైర్, వెటర్నరీ తదితర శాఖల అధికారులు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఇటీవల ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై జరిగిన ప్రమాదాలను అధికారులు విశ్లేషించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులపై పశువులు, బర్రెలు ,ఆవులు తిరగడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తించారు. అలాగే లాంగ్ డ్రైవ్లు చేసే డ్రైవర్లు నిద్రమత్తులో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ సమస్యల నివారణకు పలు కీలక సూచనలు సమావేశంలో చర్చకు వచ్చాయి. గ్రామాల సమీపంలో రహదారులపై తిరిగే పశువులను నియంత్రించేందుకు వెటర్నరీ శాఖతో పాటు స్థానిక సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. రాత్రి వేళల్లో హైవేలపై ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు చేయడం, ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ అమర్చడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.అలాగే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రహదారుల వెంట వీధి దీపాల పరిస్థితిని పరిశీలించి, చీకటి ప్రాంతాల్లో తక్షణమే లైటింగ్ సదుపాయాలు మెరుగుపర్చాలని సూచించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కే వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. పది రోజుల్లోపు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను అమలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.ఈ సమావేశంలోఆత్మకూరు సి ఐ గంగాధర్,యస్ ఐ జిలాని, తహసిల్దార్ పద్మజా కుమారి, విద్యుత్ శాఖా ఏ ఇ జమీల బేగం ఆత్మకూరు డివిజన్ పరిధిలో రెవెన్యూ ,పోలిస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

