– చిట్వేల్ జెడ్పీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం
– గంజాయి వినియోగంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం: వైద్యాధికారి
– మాదకద్రవ్యాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి: ఎస్ఐ
తిరుపతి జిల్లా చిట్వేల్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు గంజాయి, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిట్వేల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది సహకారంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ శివ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. గొంతు, ఊపిరితిత్తులకు హాని కలగడంతో పాటు దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం, ప్రవర్తనలో మార్పులు సంభవించవచ్చని వివరించారు. ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా లేదా వినియోగానికి ప్రోత్సహించినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి సోఫియా, ఎన్సీసీ ఉపాధ్యాయుడు పసుపుల రాజశేఖర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


