ప్రముఖ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థాన ప్రాంగణంలో భక్తులు మరియు గుడిలో పనిచేస్తున్న సిబ్బంది తాము వేసుకుని వచ్చిన పాదరక్షకులను ఎక్కడపడితే అక్కడ వదిలి స్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నారు. వివరాలలోకి వెళితే జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల చెప్పులు గుడిలోకి వేసుకొని పోకుండా బయటనే భద్రపరచుకొనుటకు పాదరక్షకుల స్టాండ్ ఏర్పాటు చేసి టెండర్లు వేసి టెండర్ దారునికి అప్పజెప్పడం జరిగింది. కానీ కొంతమంది భక్తులు గుడిలోకి చెప్పులు వేసుకుని వెళ్లి ఎక్కడ పడితే అక్కడ వదులుతున్న కూడా సిబ్బంది ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే చందంగా దేవస్థానంలో పనిచేసే సిబ్బంది చెప్పులు వేసుకొని గుడి ప్రాంగణంలో తిరగడమే కాకుండా ఆఫీసు రూముల మందు భాగంలోనూ మరియు ఉత్తర గాలిగోపురం లోపలి భాగంలోనూ వదులుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన భక్తులు ఏమాత్రం తడబడ కుండా ఎదేచ్చగా గుడిలో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న బ్రహ్మంగారిమఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు సిబ్బందిపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి బ్రహ్మంగారి గుడి ప్రతిష్టను కాపాడుతూ బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో భక్తులు కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ గుడిలో చెప్పులు వేసుకుని తిరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు భక్తులు కోరుచున్నారు.





