మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, డీసీ పల్లి, జూన్ 1 : ప్రతి నెలా ఒకటో తేదీ రాష్ట్రంలో పింఛన్ల పండుగగా మారిపోయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం మర్రిపాడు మండలం డీసీ పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి మంత్రి పంపిణీ చేశారు.
పండుగ వాతావరణంలో సాగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ప్రతినెలా ఒకటో తేదీ రాష్ట్రవ్యాప్తంగా “పింఛన్ల పండుగ”గా మారిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 62,47,538 మంది లబ్ధిదారులకు రూ.2,720.67 కోట్ల విలువైన పింఛన్లను జూన్ 1వ తేదీ నాటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో 2,90,009 మంది లబ్ధిదారులకు రూ.128.30 కోట్లకు పైగా పింఛన్లు అందజేస్తుండగా, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 36,354 మందికి రూ.16.22 కోట్ల విలువైన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. డీసీ పల్లి మండలంలో 376 మంది లబ్ధిదారులకు రూ.16.29 లక్షల విలువైన పింఛన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకే ప్రతి నెల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు. పింఛన్ల పంపిణీ విధానంపై లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మంత్రి వెంట ఆర్డీవో పావని, డిఆర్డిఏ పిడి నాగరాజు కుమారి, తాసిల్దార్ అనిల్ కుమార్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.




