ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గుర్తింపునకు PRASHAST 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 17. పున్నమి ప్రతినిధి
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల (CwSN) గుర్తింపునకు PRASHAST 2.0 కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు తెలిపారు.
2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన విద్యా, వైద్య, పునరావాస సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.
అన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జూలై 31లోపు PRASHAST 2.0 యాప్లోని శిక్షణ వీడియోలను పూర్తిగా వీక్షించాలని, ఆగస్టు 15లోపు UDISE+ వివరాలను నవీకరించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్ట్-1 స్క్రీనింగ్, అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా పార్ట్-2 స్క్రీనింగ్ నిర్వహించి, గుర్తించిన ప్రతి విద్యార్థికి (ఇండివిడ్యూల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ) (ఐ ఈ పి ) రూపొందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర విద్య అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సాధారణ మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు సమన్వయంతో ప్రభుత్వం నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం విజయవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు కోరారు.

