నేర్రపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు
గ్రామాభివృద్ధికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి : నాయకులు
పున్నమి న్యూస్
ఇబ్రహీంపట్నం, జూలై 5: ఇబ్రహీంపట్నం మండలంలోని నేర్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావణమోని లింగం ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఆకుల కరుణాకర్, ఉపాధ్యక్షుడిగా వంశీ, ప్రధాన కార్యదర్శిగా ఆరూరి బాలకృష్ణ, కార్యదర్శిగా ఆకుల సాయికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో మరింత బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ కమిటీలు వేదికగా నిలవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కొత్త కమిటీలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చని నాయకులు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పన, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల వైస్ ప్రెసిడెంట్ తాళ్ల కృష్ణ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు యాదగిరి రెడ్డి, నాగరాజు, లింగం, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు యాదగిరి, దర్శన్, సైదులు, శ్రీను, మహేష్, నాగేష్, భాస్కర్ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.




