-నెల్లూరు: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ముగింపు. బారా షహీద్ దర్గాలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన అధికారులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్ నేతృత్వంలో స్థానిక బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా త్వరలో స్థానిక బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరగనున్న రొట్టెల పండుగ నిర్వహణ కోసం అవసరమైన పారిశుధ్య నిర్వహణ పనులను పూర్తిస్థాయిలో చేపట్టామని, సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.అదేవిధంగా గత నెల రోజుల నుంచి నగరపాలక సంస్థ పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామని, అందులో భాగంగా పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ నెల రోజులపాటు పరిశుభ్రతా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. మొదటి వారంలో నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ మలమూత్రాల విసర్జనను అరికట్టేందుకు, పబ్లిక్ ప్రాంతాలలో పాన్, గుట్కా ఉమ్మితో కూడిన మరకలు తొలగించి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని నెల్లూరును అత్యంత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నామని ప్రకటించారు.రెండవ వారంలో డ్రైను కాలువలను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించేందుకు, పూడికతీత పనులతో మురుగు నీరు సాఫీగా ప్రవహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మూడో వారంలో అపరిశుభ్రంగా ఉన్న కమర్షియల్ ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన పారిశుద్ధ నిర్వహణకు శాశ్వత పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. నాలుగో వారంలో నగరవ్యాప్తంగా ఉన్న ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తీరు పరిశీలించి అవసరమైన మేరకు మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టేలా ప్రణాళిక బద్దంగా కృషి చేశామని డాక్టర్ ప్రకటించారు. స్వచ్ఛ నెల్లూరు నగరం లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు, అన్ని ప్రభుత్వ విభాగాలు, యువతను భాగస్వాములను చేయనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, శానిటేషన్ విభాగం సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.


