నిషేధిత భూములపై ఆందోళన వద్దు
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఆగస్టు 11:
నిషేధిత భూముల పీఓబీ, 22ఎ జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ అనుమతులు తదితర అన్ని పత్రాలను ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్
ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఏది నిజమైన పత్రం, ఏది బోగస్ డాక్యుమెంట్ అనే విషయాన్ని పరిశీలించేందుకు ఆన్లైన్ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు. పహానీలకు కూడా సబ్ రిజిస్ట్రార్లకు యాక్సెస్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అర్హులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు
పీఓబీకి సంబంధించిన దరఖాస్తులను కేస్-బై-కేస్గా పరిశీలించి, జెన్యూన్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. 22ఎ పేరుతో పేదలు, అర్హులకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, ఆన్లైన్లో ఉన్న సమాచారం మేరకే వారి నిర్ణయాలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ తిరస్కరణకు కారణాలు చెప్పాలి
పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా, అవసరమైతే మూడు రోజుల సమయం తీసుకుని తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. పీఓబీ దరఖాస్తులను ఇకపై తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపించాలని ఆదేశించారు.
మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి 22ఎ/పీఓబీ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డి.ఎస్. లోకేశ్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్గాంధీ హనుమంత్తో పాటు ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు.



