ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
నారంపేట గ్రామ ప్రజల చిరకాల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన “జల ప్రసాదం” పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత RO ప్లాంట్ను ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరి నాయుడు మాట్లాడుతూ, నారంపేట గ్రామ ప్రజల మంచినీటి సమస్యను దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి పరిష్కారం చూపిన శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారు అభినందనీయులు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆత్మకూరు నియోజకవర్గానికి గర్వకారణం అని పేర్కొన్నారు.
ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే గొప్ప మానవతావాది పరమేశ్వర రెడ్డి గారు. వారు చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ RO ప్లాంట్ గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంతో దోహదపడుతుంది” అన్నారు.
ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ,
“కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలనే లక్ష్యంతో ‘జల ప్రసాదం’ పథకాన్ని ప్రారంభించాం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి పనులు చేపడితే బాధ్యత, శ్రద్ధ మరింత పెరుగుతాయి. భవిష్యత్తులో గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మా ట్రస్ట్ పూర్తి సహకారం అందిస్తుంది” అని తెలిపారు.కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలు కంచి పరమేశ్వర రెడ్డి, కంచర్ల శ్రీహరి నాయుడు మరియు ఇతర అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


