*🟥గూడూరు పరిసర ప్రాంతాల దేవాలయాల ఈవో రవిశంకర్ పై జిల్లా కలెక్టర్కు బీజేపీ నేతలు, ఆలయ కమిటీ ఫిర్యాదు*
*🟥దేవుడి హుండీ ఆదాయం, భక్తులు సమర్పించే కానుకలను ఈవో తన సొంత ఖర్చులకు వాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణ*
*🟥గత ఆరు నెలలుగా అర్చకులకు కనీస వేతనాలు, స్వామివారి ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఈవో నిర్లక్ష్యం – రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు*
*🟥సమావేశాలకు హాజరైనా మినిట్స్ బుక్లో వివరాలు నమోదు చేయకుండా, కమిటీని పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వైనం – ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు*
*🟥శివరాత్రి హుండీ ఆదాయం, దర్శన టికెట్ల ద్వారా వచ్చిన సుమారు రూ. 5 లక్షల దేవుడి సొమ్ములో భారీగా గోల్మాల్ – జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి*
*🟥దేవస్థానానికి చెందిన 4.11 సెంట్ల భూమిని ఎవరికి కౌలుకు ఇచ్చారో కమిటీకి కూడా చెప్పకుండా గోప్యత*
*🟥దేవుడి నిధులను పక్కదారి పట్టించిన అవినీతి ఈవోపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
గూడూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు దేవాలయాలకు కార్యనిర్వహణాధికారి (ఈవో)గా వ్యవహరిస్తున్న రవిశంకర్ భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్, బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆలయ చైర్మన్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు ఈ మేరకు కలెక్టర్కు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకలు, హుండీ ఆదాయాన్ని ఈవో తన సొంత ఖర్చులకు వాడుకుంటూ, దేవుడి కైంకర్యాలను, సిబ్బంది వేతనాలను గాలికొదిలేశారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గత 2025 డిసెంబర్ 15వ తేదీన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి నేటి వరకు ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనాలు ఇవ్వకపోగా, స్వామివారికి నిత్యం జరగాల్సిన ధూప, దీప నైవేద్యాలకు సైతం ఈవో రవిశంకర్ డబ్బులు మంజూరు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నూతన కమిటీ ఏర్పడిన ఈ ఆరు నెలల కాలంలో నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించగా, ఆ సమావేశాలకు ఈవో మొక్కుబడిగా హాజరవుతున్నారే తప్ప, చర్చించిన అంశాలను కనీసం మినిట్స్ బుక్లో నమోదు చేయడం గానీ, కమిటీ సభ్యుల సంతకాలు తీసుకోవడం గానీ చేయడం లేదని వారు ఆరోపించారు. ఒకవైపు ఆలయ కమిటీ చొరవ తీసుకుని దాతల నుంచి సుమారు ఆరు లక్షల రూపాయల విరాళాలు సేకరించి, పారదర్శకంగా రసీదులు ఇస్తూ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతుంటే, ఈవో తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందన్నారు.
ఆలయ ఆదాయం, హుండీ లెక్కల విషయంలో ఈవో వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు పలు ఆధారాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ ఏర్పడక ముందు డిసెంబర్ 5న జరిగిన హుండీ లెక్కింపులో రూ. 1,14,000 ఆదాయం రాగా, ఫిబ్రవరి నెలలో హుండీ ఆదాయం, శివరాత్రి ప్రత్యేక దర్శన టికెట్లు, టెంకాయలు, పాలు తదితర విక్రయాల ద్వారా మరో రూ. 3,86,000 ఆదాయం సమకూరింది. అయితే ఇంత భారీ మొత్తంలో నిధులు వచ్చినప్పటికీ, ఈవో రవిశంకర్ కేవలం ఒకసారి 40 వేలు, మరోసారి లక్ష రూపాయలు మాత్రమే ఆలయ అవసరాలకు ఇచ్చి, మిగతా దేవుడి సొమ్మును పక్కదారి పట్టించారని వారు ఆరోపించారు. దీనికి తోడు దేవస్థానానికి చెందిన 4.11 సెంట్ల భూమిని ఎవరికి కౌలుకు ఇచ్చారు, దాని ద్వారా ఎంత కౌలు వస్తుందనే కనీస సమాచారాన్ని కూడా కమిటీకి తెలియజేయకుండా ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుడి ఆస్తులకు, నిధులకు రక్షణ లేకుండా పోతోందని, తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. దేవాలయానికి రావాల్సిన నిధులకు పక్కాగా లెక్కలు చూపించేలా ఈవోను ఆదేశించడంతో పాటు, పెండింగ్లో ఉన్న అర్చకుల వేతనాలు, ధూప దీప నైవేద్యాల ఖర్చులను తక్షణమే ఇప్పించాలని, అవినీతికి పాల్పడిన ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన వారిలో గూడూరు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు కే. దయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.



