గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ దండే విఠల్
పెంచికలపేట, జూలై 28: పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ట్రాక్టర్పై వెళ్లి రైతులతో కలిసి పరిస్థితిని పరిశీలించిన ఆయన అనంతరం అటవీ, రెవెన్యూ అధికారులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపారు.
తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని అధికారులను ఎమ్మెల్సీ హెచ్చరించారు. గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతులను బెదిరించడం లేదా వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం తగదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, “గిరిజనుల హక్కులను కాపాడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాటం చేస్తాం. పోడు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం” అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ జోక్యంతో అధికారులు సానుకూలంగా స్పందించి, గిరిజన రైతులు తమ పోడు భూముల్లో వ్యవసాయం కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిన ఎమ్మెల్సీ దండే విఠల్కు గిరిజన రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.




