*కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ వినాశనం – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజం..*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పల్లెల్లో విధ్వంసం పడకేసిన పారిశుధ్యం పట్టించుకోనీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ గ్యారెంటీలను నమ్మి అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని,గత కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి పండుగలా సాగితే, నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో ప్రతి పల్లెకు కాళేశ్వరం, మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తే, నేడు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీరు అందక, కరెంట్ కోతలతో రైతులు విలవిలలాడుతున్నారు.
కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తే, నేడు 7 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. యూరియా, ఎరువుల కోసం యాప్ల పేరుతో రైతులను ఐడీలు, పాస్వర్డ్లు, ఓటీపీల చుట్టూ తిప్పుతూ గోస పెడుతున్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా దగా చేశారు.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ రూపకల్పన చేసిన సీతారామ ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లైనింగ్ పనులను కూడా సరిగా చేయకపోవడంతో కాలువలు గండిపడుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాలను పక్కనబెట్టి పక్క రాష్ట్ర ప్రయోజనాలకు లబ్ధి చేకూరుస్తున్నారు.
రూ. 2,500 మహాలక్ష్మి పథకం, రూ. 4,000 ఆసరా పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలకు ఇస్తామన్న రూ. 12,000 ఆర్థిక సాయం ఏదీ అమలు కాలేదు. స్కూళ్లు, కాలేజీలు, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో సమస్యలు సృష్టించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, కేసీఆర్ అంటే ఒక శక్త్యంశ అని, త్వరలోనే ప్రజల తరఫున కేసీఆర్ సింహంలా తిరగబడి కాంగ్రెస్ దొంగ గ్యారెంటీలను ఎండగడతారని హెచ్చరించారు. బిఆర్ఎస్ శ్రేణులంతా సంఘటితంగా ఉండి కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి,RJC కృష్ణ, లకావత్ గిరిబాబు,మనీషా లక్ష్మి, కూరాకుల నాగభూషణం, కళావతి,కృష్ణార్జున రావు తదితరలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



