పున్నమి ప్రతినిధి వరికుంటపాడు
మండల కేంద్రమైన వరికుంటపాడు గ్రామపంచాయతీలో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తే దాడికి యత్నిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తలుపులు, కిటికీలు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధుల భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కోతుల బెడదపై అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని పట్టుకునే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోతులు గ్రామంలోకి రాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.

