తిరుపతి కలెక్టరేట్, ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియ గందరగోళంగా సాగుతోందని రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కలెక్టర్ తో మాట్లాడిన ఆయన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, ఆ నోటీసులు ఎవరికి ఇచ్చారనే సమాచారం రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు అందించడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గంధం చంద్రుడు, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నప్పటికీ, ఆ మార్పుల వల్ల ఓటర్లకు ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల మార్పులపై అభ్యంతరాలను వ్రాతపూర్వకంగా అందించినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అధికారులే పాటించకపోతే ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలిస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.



