ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్లో ఇళ్ల కూల్చివేతపై స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. చర్చి కాంపౌండ్ సమీపంలోని బ్రిడ్జి మార్గాన్ని మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు లేవని, కూల్చివేతతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్థానికులు స్పష్టం చేశారు. స్థానికుల ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో పాటు పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇళ్ల కూల్చివేతపై అధికారులు స్పష్టత ఇచ్చి, బాధితుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.



