హైదరాబాద్, మే
( పున్నమి ప్రతినిధి )
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ పేరుతో ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సంబంధించిన వ్యవహారంలో ఆరెస్సెస్ కార్యకర్తలను, సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని సంఘ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పేర్లను ప్రస్తావిస్తూ బండి సంజయ్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని మండిపడింది. వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు ప్రచారం చేసి సంఘ్ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరెస్సెస్ విమర్శించింది.
సమాజ సేవలో నిమగ్నమై ఉన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలను కొనసాగిస్తే సంబంధిత వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్టపరమైన మరియు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అలాగే బీజేపీ అంతర్గత, సంస్థాగత వ్యవహారాలతో ఆరెస్సెస్కు ఎలాంటి సంబంధం లేదని సంఘ్ వెల్లడించింది. బీజేపీ వ్యవహారాలను ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే పర్యవేక్షిస్తుందని, ఆరెస్సెస్ తెలంగాణ శాఖకు ప్రత్యక్ష జోక్యం లేదని పునరుద్ఘాటించింది.
మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొంటూ, ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలను నిలిపివేయాలని ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతం హెచ్చరించింది.



