అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): అనపర్తి సాయి మాధవి డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జాబ్ మేళా”ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు వచ్చిన నిరుద్యోగ యువతతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యువతకు సూచించారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





