సిద్ధవటం మండల కేంద్రంలోని ఎగువపేట జడ్పీహెచ్ఎస్ హైస్కూలులో మంగళవారం 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.కడప అర్బన్ ఐసిడిఎస్ ఇన్చార్జి సీడీపీఓ సుగుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.శిక్షణలో చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక, భాషా, భావోద్వేగ అభివృద్ధి, పాఠశాల సంసిద్ధత, ప్రారంభ బాల్య విద్య తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే చిన్నారుల వయస్సుకు అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన వివిధ డొమైన్లపై అవగాహన కల్పించారు. పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేలా బోధనా-అభ్యసన కార్యకలాపాలను నిర్వహించే విధానం, ఆటల ద్వారా విద్యాబోధన, పిల్లల ప్రతిభను గుర్తించే పద్ధతులను వివరించారు.అదేవిధంగా చిన్నారుల అభ్యసన స్థాయిని గుర్తించేందుకు అనుసరించాల్సిన మూల్యాంకన విధానాలపై కూడా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో ఆచరణలో పెట్టి పిల్లల ప్రారంభ దశ విద్యను మరింత మెరుగుపర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్పీలు పురుషోత్తం,ఇలియాస్,సంజీవ పాల్గొని శిక్షణలోని ముఖ్యాంశాలను వివరించారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీవిద్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


