హైదరాబాద్, జూలై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ /పువ్వాడ నాగేంద్ర కుమార్ )
తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు, సంస్థ అభివృద్ధిపై నిర్లక్ష్యం, కొత్త బొగ్గు గనుల సాధనలో ఆసక్తి చూపకపోవడం వల్ల సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడడం, వేలాది కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించడం లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో సత్తుపల్లి సైలో బంకర్ నిర్మాణంలో నాణ్యత లోపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, తాడిచెర్ల–II బొగ్గు బ్లాక్ను నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆసక్తి లేమి కారణంగా సింగరేణికి కేటాయించిన కొన్ని బొగ్గు బ్లాక్లు కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
సింగరేణి బలోపేతం అంటే కేవలం ఒక ప్రభుత్వ సంస్థ అభివృద్ధి మాత్రమే కాదని, 40 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు, వేలాది కార్మిక కుటుంబాల జీవనాధారం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సింగరేణి పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, , వరంగల్ జిల్లా బిజెపి ఇన్చార్జ్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవారావ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి,, రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్, పలు జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.



