శ్రీవారిమెట్టు సమీపంలో భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాల పంపిణీ
పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 20
శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారిమెట్టు సమీపంలో ఉన్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఉదయం 7 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగ నివేదన అనంతరం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. దుష్టశిక్షణకు ప్రతీకగా స్వామివారు మూడుసార్లు బళ్లెంను ప్రయోగించే విశిష్ట ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆస్థానం నిర్వహించారు. తరువాత సాయంత్రం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.
అన్నమయ్య సంకీర్తనలు – భజనలు – అన్నప్రసాదాల పంపిణీ
పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భజన బృందాలు భజనలు, కోలాటాలతో భక్తులను అలరించగా, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ.శరత్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాధ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్జయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
—————————
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




