నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
“స్వర్ణభారత్–సేవా హారతి” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా యోగి ఆదిత్యనాథ్ అక్షర విద్యాలయం, సోమా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. విద్యార్థులు, శిక్షణార్థులతో ముచ్చటించారు. అనంతరం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్య, నైపుణ్య శిక్షణ, సామాజిక సేవ రంగాల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
చదువుకు దూరమైన పిల్లలను విద్యా వ్యవస్థలోకి తీసుకురావడంలో స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో పాటు భారతీయ విలువలు, సంస్కృతిపై అవగాహన కలిగిన యువత అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

