(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
అనకాపల్లి జిల్లా, జూన్ 5 ఎలమంచిలి :
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులు నివసిస్తున్న ఆర్టిజన్స్ కాలనీ తీవ్ర కాలుష్య సమస్యతో ఆందోళన చెందుతోంది. కాలనీ సమీపంలోని వరాహ నది ఒడ్డున గ్రామ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు పదార్థాలను పడేసి నిప్పంటించడం వల్ల వెలువడుతున్న విషవాయువులు కాలనీని కమ్మేస్తున్నాయి. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
సమస్యను పలుమార్లు పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిన కళాకారుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొంటున్నారు. చెత్త దహనాన్ని వెంటనే నిలిపివేసి, కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్టిజన్స్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.


