– కొండలు దాటి చదువుకున్న పట్టుదల.. నేడు విద్యార్థులకు మార్గదర్శకుడు
మారుమూల గ్రామంలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో పుట్టి, కొండలు కోనల మధ్య నడిచి చదువుకున్న గోగల పుల్లయ్య నేడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పాఠశాల సహాయకుడు (ఇంగ్లిష్)గా పనిచేస్తున్న ఆయన 2026 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం కలెక్టర్ సభ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పెనగలూరు మండలం పెర్లకుంటకు చెందిన పుల్లయ్య చిన్ననాటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. పాఠశాలకు వెళ్లేందుకు కొండలు ఎక్కి దిగాల్సి రావడంతో వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 33 మంది పదో తరగతి విద్యార్థుల్లో ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఎం.ఏ., బి.ఈడీ., ఎం.ఫిల్. పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఇంగ్లిష్పై ఆసక్తిని పెంచుతున్నారు. ఆయనకు అవార్డు రావడంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెర్లకుంట గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


