– పదోన్నతి హోదా కాదు.. పెరిగిన బాధ్యత
– కొత్త బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలి
– ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ అందించాలి
కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఆరుగురు సిబ్బందిని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు శనివారం అభినందించి శాలువాలతో సత్కరించారు. రేణిగుంటకు చెందిన బి.డి. జగన్మోహన్, గాజులమండ్యానికి చెందిన పి. బాలకృష్ణ, ఎయిర్పోర్ట్కు చెందిన ఈ. శ్రీపతి, చిట్వేల్కు చెందిన వి. రమణ, ఓబులవారిపల్లెకు చెందిన వి. వెంకటయ్య, ఏర్పేడుకు చెందిన ఎం. కవిత పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, బాధ్యత మరింత పెరగడానికి లభించిన అవకాశమన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో కొత్త బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ మర్యాదపూర్వకంగా విధులు నిర్వహించి పోలీస్శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు.


