విశాఖపట్నం, సెప్టెంబర్ 13:
పర్యావరణ పరిరక్షణపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని అక్షర్ లిటిల్ స్కాలర్స్ స్కూల్, ప్రహ్లాదపురం ప్రిన్సిపాల్ మాధవిలత చార్లెస్ అన్నారు.
వినాయక చవితి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలు, మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పర్యావరణహిత పద్ధతులను అలవర్చుకోవడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించవచ్చని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థుల చేత స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి, వాటిని ఇతరులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మాధవిలత చార్లెస్ పేర్కొన్నారు.
“ప్రకృతిని కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు.. భావితరాలకు మనం అందించాల్సిన విలువైన వారసత్వం” అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రోత్సహించి, ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



