కుబీర్: సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) మండల కేంద్రంలోని శ్రీ ధనేశ్వర ఆలయంలో శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ముందుగా గణపతి పూజ, ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం శిఖర కలశాన్ని బాజా భజంత్రీల నడుమ, మహిళల మంగళహారతులతో ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తూ ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శిఖర కలశ ప్రతిష్ఠాపనతో ధనేశ్వర ఆలయంతో పాటు పరిసర ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.



