మార్గదర్శకాల సవరణ కోసం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పన
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 173 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా, ఈ విధానంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి, పటిష్ఠంగా అమలు చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనుండగా, సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్గా ఉంటారు. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు.
ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను సవరించి, పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీ త్వరలోనే సమావేశమై కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.


