*చేనేత కళను కాపాడుతూ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు*
*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్*
*రామచంద్రపురం రూరల్, ఆగస్టు 7:*
చేనేత రంగాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు నేతన్నలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. శుక్రవారం రామచంద్రపురం రూరల్ మండలం ఆదివారపుపేటలోని శ్రీ శివ బాలయోగి మహారాజ్ చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సమావేశ మందిరంలో నిర్వహించిన చేనేత నేతన్నల సంక్షేమం, పురోగతిపై ముఖాముఖి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం నేతన్న లతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత కళ ప్రతీకగా నిలిచిందన్నారు. తరతరాలుగా ఈ కళను సజీవంగా ఉంచుతున్న నేతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, చేనేత రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
*71,536 మంది నేతన్నలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయం*
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 71,536 మంది చేనేత కార్మికులకు రూ.179 కోట్ల ఆర్థిక సహాయాన్ని డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.
*కోనసీమ జిల్లాలో వేలాది మంది నేతన్నలకు లబ్ధి*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ‘నేతన్న సేవలో’ పథకం కింద 3,822 మంది నేతన్నలు లబ్ధి పొందుతున్నారని, ప్రతి అర్హ చేనేత కార్మికుడికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న అర్హ చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందిస్తున్నామని, జిల్లాలో 3,863 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
*ఉచిత విద్యుత్తో ఉత్పత్తి వ్యయం తగ్గింపు*
చేనేత కార్మికులపై విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో 3,567 మంది నేతన్నలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, మగ్గం ఆధారిత చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం అనేక చేనేత సహకార సంఘాలు ప్రభుత్వ శాఖల ఆర్డర్లపైనే ఆధారపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడి ప్రైవేట్ రంగం, ఈ-కామర్స్ వేదికలు, దేశవ్యాప్త ఓపెన్ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. దక్షిణ భారతదేశంతోపాటు ఉత్తర భారతదేశంలో కూడా చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని, మార్కెట్ అభిరుచులను అధ్యయనం చేసి ఉత్పత్తులను రూపొందిస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
*కొత్త డిజైన్లతో యువతను ఆకర్షించాలి*
ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా రంగులు, నమూనాలు, డిజైన్లు, వస్త్ర రకాల్లో నూతనత్వం తీసుకురావాలని మంత్రి సుభాష్ సూచించారు. వినియోగదారులను ఆకట్టుకునే నాణ్యమైన ఉత్పత్తులను రూపొందిస్తే చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ లభిస్తుందని చెప్పారు. ఆధునిక డిజైన్లతోపాటు సంప్రదాయ కళాత్మకతను జోడించి ఉత్పత్తులు రూపొందించడం ద్వారా యువతను కూడా చేనేత రంగం వైపు ఆకర్షించవచ్చని అభిప్రాయపడ్డారు.
*సబ్సిడీలు, రుణాలు, పనిముట్లతో పూర్తి సహకారం*
జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా అవసరమైన పనిముట్లను 90 శాతం వరకు సబ్సిడీతో అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సహకార చేనేత కార్మికుల పొదుపు పథకం, చేనేత ముద్ర పథకం ద్వారా రుణ సదుపాయాలు, ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
చేనేత సహకార సంఘాలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
“చేనేత కళను కాపాడుదాం… నేతన్నల కుటుంబాలకు అండగా నిలుద్దాం… చేనేతను ప్రపంచ మార్కెట్లలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళదాం” అని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు.
కార్యక్రమం ముందుగా ఆదివారపుపేటలో తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పాలనపై , సంక్షేమ విజయాలపై మంత్రి సుభాష్ డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో హ్యాండ్లూమ్ ఏడీఓలు వెంకటేశ్వరరావు, జి. గుర్రాజు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, చేనేత కళాకారులు, సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు పాల్గొన్నారు.

