శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం.. పాల్గొన్న చెవిరెడ్డి కుటుంబీకులు
తిరుపతి రూరల్ ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
తిరుపతి రూరల్:తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబీకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాల్లో తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.
నాలుగు రోజులూ వైదిక కార్యక్రమాలు
పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, వేదపఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో పుట్టమట్టితో అంకురార్పణ చేపట్టారు. ఆదివారం పవిత్ర ప్రతిష్ఠ, సోమవారం పవిత్ర సమర్పణ, మంగళవారం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ప్రతిరోజూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు పాల్గొన్నారు.


