పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ముప్పిడి
తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి), సెప్టెంబర్ 4: తాళ్లపూడి మండలం తాడిపూడి, బయ్యవరం గ్రామాల పరిధిలోని పొలాలను పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా గుర్తించేందుకు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీఓ కె. ఆనందరావు శుక్రవారం సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తాడిపూడి, బయ్యవరం పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల రాకతో ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మీ లావణ్య, తాడిపూడి సొసైటీ అధ్యక్షుడు నామా కొండబాబు, అనపర్తి ప్రసాద్, సర్వేయర్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.



