విశాఖపట్నం జూన్11(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): విశాఖపట్నం కేంద్ర గ్రంథాలయం ఎదుర్కొంటున్న వసతి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ తీసుకు వెళ్లారు. స్థానిక శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు,శాసన సభ్యులు, జాయింట్ కలెక్టర్ మరియు రెవెన్యూ శాఖాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఎం. అభిషిక్త్ కిషోర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెం రెడ్డి సతీష్ కుమార్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా కేంద్ర గ్రంథాలయం , జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాలను తాత్కాలిక వసతి కొరకు సుమారు 4000 నుండి 5000 చదరపు అడుగుల భవనాలు కేటాయించమని అభ్యర్థించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. దండు బజార్లోని స్వంత స్థలంలో శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు, అందుబాటులో ఉన్న కొన్ని భవనాలను, ఏపీఐఐసీ భవనాన్ని కేటాయించడానికి సంబందిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఆయా శాసనసభ్యులు సూచన మేరకు మరిన్ని పుస్తక నిక్షిప్త కేంద్రాలను నియోజక వర్గాలలో ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం కేటాయించే ప్రభుత్వ భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.



