తల్లాడ /ఖమ్మం
తల్లాడ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ఇంటి చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వైరా సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం తల్లాడ బస్టాండ్ వద్ద జంగాల స్వరూప్కుమార్ అలియాస్ శాంతి స్వరూప్ అలియాస్ వినయ్కుమార్ (41)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 11న గంగదేవిపాడు గ్రామానికి చెందిన సిలివేరు నరసింహారావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు తలుపు, ఇనుప బీరువా పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దర్యాప్తులో నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అలాగే తల్లాడలో మరో ఇంటి తాళం పగులగొట్టి రెండు బంగారు ఉంగరాలు చోరీ చేసి, వాటిని గన్నవరంలోని ఎస్ఆర్ బంగారం దుకాణంలో విక్రయించినట్లు వెల్లడించాడు.
తల్లాడ ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. నిందితుడికి గతంలోనూ పలు చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ఆస్తి నేరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.



