నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి చేతుల మీదుగా సత్కారం
కోటకొండ హరికిరణ్ (పున్నమి ప్రతినిధి) : ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. శేషారత్నం పదవీ విరమణ వేడుక గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి , డాక్టర్ శేషారత్నం ని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డాక్టర్ శేషారత్నం సేవలను కొనియాడారు. ఆమె తన సుదీర్ఘ వైద్య సేవా ప్రస్థానంలో ఎన్నో వేలాది మంది రోగులకు నిస్వార్థ సేవలు అందించి ఆదర్శవంతమైన వైద్యాధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆమె క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావం కారణంగా అనేక అవార్డులు మరియు పదోన్నతులు వరించాయని పేర్కొన్నారు.
అలాగే ఆమె నాయకత్వంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి దిశగా పయనించి, అత్యున్నత ప్రమాణాలతో ప్రజలకు వైద్య సేవలు అందించగల స్థాయికి చేరుకుందని అన్నారు.
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా సుమారు 6 లక్షల మందికి పైగా రోగులకు, వారి సహాయకులకు మరియు ఆసుపత్రి సిబ్బందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించే అవకాశం కలగడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
“మా ట్రస్ట్ ద్వారా అన్నప్రసాదం స్వీకరిస్తున్న వేలాది మంది నిరుపేద రోగుల తరపున, అలాగే వ్యక్తిగతంగా నా తరపున డాక్టర్ శేషారత్నం శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ శేషారత్నం కు శుభాకాంక్షలు తెలిపారు.


