తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, వి.యన్. కుమార్ : పున్నమి ప్రతినిధి:
తాళ్లపూడి మండలంలోని గోపవరం రోడ్డులో ఉన్న కొండల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు నిత్యం ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ను తరలిస్తూ భారీగా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు కొండ ప్రాంతాల సహజ వనరులు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ తవ్వకాలు, గ్రావెల్ తరలింపుపై అధికారులు తక్షణమే దృష్టి సారించి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


