ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి జిల్లా రిపోర్టర్ )
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు చేపట్టడంలో భాగంగా ఖమ్మం జిల్లా లోని కారేపల్లి మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలపై శుక్రవారం పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో కారేపల్లి ఎస్సై గోపి, వ్యవసాయ శాఖ ఏవో అశోక్ పాల్గొన్నారు. దుకాణాల్లో విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వల పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశంతో పాటు ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు తేదీ, కంపెనీ వివరాలను కూడా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, పురుగుమందులు విక్రయించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. అలాంటి దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద విత్తనాలు లేదా ఎరువులు కనిపించిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.



