యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
పురపాలక సంఘ పరిధిలో ఇటీవల చేపట్టిన వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న సాంకేతిక, భౌగోళిక లోపాలను తక్షణమే సరిదిద్దాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయాధికారికి వినతిపత్రం సమర్పించారు. గతంలో 13వ వార్డులో భాగమైన భవనం వీధి, కోర్టుపేట, గాంధీనగరం ప్రాంతాలను ప్రస్తుత విభజనలో భవనం వీధిని 11వ వార్డులోకి కలపడం అసంబద్ధంగా ఉందని తెలిపారు. రోడ్డు అవతల ఉన్న పాత ఎస్.సి కాలనీ పోలింగ్ స్టేషన్ పరిధిని పరిగణనలోకి తీసుకుంటే, ఈ మార్పు వయోవృద్ధులకు, స్థానిక ఓటర్లకు తీవ్ర అవాంతరాలను కలిగిస్తుందని పేర్కొన్నారు. భవనం వీధి ఓటర్లను వేర్వేరు పరిధుల్లోకి విడదీయడమే కాకుండా గాంధీనగరం, మోటూరి వారి వీధి, ఎయిర్టెల్ టవర్ సమీప ప్రాంతాల ఓటర్ల వివరాలు జాబితాలో అస్తవ్యస్తంగా నమోదయ్యాయని వెల్లడించారు. అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని, సదరు వార్డుల్లోని ఓటర్లందరినీ ఒకే సమగ్ర పరిధిలోకి తీసుకువచ్చి దోషరహితమైన నూతన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని ఈశ్వర గుప్తా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డాక్టర్ త్రినాథ్ పాల్గొన్నారు


