పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 17: మండలంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రక్కిలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హారిక గుప్తా, డాక్టర్ చింత థెరిస్సా సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వెళ్లాలని తెలిపారు.
బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ, ముఖానికి స్కార్ఫ్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ ధరించాలని సూచించారు. లేత రంగు, కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుందని తెలిపారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, దాహం లేకపోయినా తరచూ నీరు తాగాలని చెప్పారు. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా శరీరంలో నీరు, ఉప్పు సమతుల్యత నిల్వ ఉంటుందని వివరించారు.
వేసవిలో మద్యం, కాఫీ, టీ, అధిక చక్కెర ఉన్న పానీయాలు, అలాగే మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. కీరదోస, పుచ్చకాయ వంటి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల వడదెబ్బ ప్రమాదం తగ్గుతుందని తెలిపారు.
ఇళ్లలో కిటికీలకు పరదాలు వేసుకోవడం, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం, చల్లటి నీటితో స్నానం వంటి చర్యలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో తిరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడదెబ్బ లక్షణాలుగా తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు, అలసట, చర్మం పొడిబారడం, అధిక జ్వరం, అపస్మారక స్థితి వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడిని వెంటనే చల్లటి ప్రదేశానికి మార్చి, చల్లటి నీరు చల్లడం, తడి గుడ్డతో తుడవడం, ఓఆర్ఎస్ లేదా మంచినీరు ఇవ్వాలని సూచించారు. పరిస్థితి విషమిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు.



