ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కొణిజర్ల మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, తాము ఏసీబీ అధికారులు అని చెప్పి తమ ఫోన్పే ఖాతాకు రూ.3 లక్షలు పంపించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
వారి మాటతీరు అనుమానాస్పదంగా ఉండటంతో సంబంధిత అధికారి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో జరుగుతున్న ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ, “అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు. ఎవరైనా ఏసీబీ పేరుతో బెదిరిస్తూ డబ్బులు అడిగితే నమ్మవద్దు” అని స్పష్టం చేశారు.
ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే 91543 88981 నంబర్కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



