తిరుపతి ఆగస్టు 6 పున్నమి ప్రతినిధి (సిపిఎం)
*తిరుపతిలో ప్రశాంత* *వాతావరణానికి భంగం* *కలిగించకండి.*
*సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్*
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా జేబీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన అనంతరం చోటుచేసుకున్న సంఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, అధికార, ప్రతిపక్ష పార్టీలు సంయమనం పాటించాలని, తిరుపతి ప్రశాంతతకు భంగం కలిగించడం మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు. అలాంటి హక్కులను వినియోగించిన వారిపై దాడులకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం, సంఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.
ప్రశ్నలకు, విమర్శలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాల్సింది పోయి రౌడీయిజానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయాలని చూడడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్య అని పేర్కొన్నారు.
జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ నైతిక బాధ్యత వహించి వెంటనే బహిరంగంగా స్పందించాలని, బాధితులకు, మీడియా ప్రతినిధులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, దాడికి పాల్పడిన వారిపై పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో హింస, బెదిరింపులు, రౌడీయిజానికి ఎలాంటి స్థానం లేదని, ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కోరారు.


