రాజమహేంద్రవరంలో బీజేపీ జెండాల పండుగ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 (పున్నమి ప్రతినిధి):
బీజేపీ చేపట్టిన “మన ఊరు–మన జెండా” కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో “100 జెండాల పండుగ” ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ పార్టీ శ్రేణులు కార్ల ర్యాలీగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. అనంతరం 36, 39వ వార్డుల్లో బీజేపీ జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
నటరాజ్ థియేటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే “మన ఊరు–మన జెండా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




