ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ జిల్లా/ రిపోర్టర్
పువ్వాడ నాగేంద్ర కుమార్ )
సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు మండిపడ్డారు.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి ప్రజాస్వామ్యవాదికి ఉన్న హక్కు అని, ఆ హక్కును అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్లో జరుగుతున్న పనులు, నిధుల వినియోగం, కేటాయింపులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల్లో అధిక ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఫుడ్ పార్క్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన కోటేశ్వరరావు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉండదని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



