రాజుకుంటలో మహిళా భద్రతపై అవగాహన
చిట్వేలు: రాజుకుంట గ్రామంలో మహిళలు, బాలికల భద్రతపై చిట్వేలు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రైల్వేకోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సై ఎస్. వినోద్కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానం, మహిళలపై నేరాల నివారణపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింక్లకు స్పందించవద్దని, బ్యాంకు వివరాలు, OTPలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.బాల్య వివాహాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర సమయంలో 112కు కాల్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.


