ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో జహీరపుర, గుట్టల బజార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిని నిందితుడు తుడుము గోపి (28) గమనించాడు. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేశాడు.
చోరీ సొత్తును విక్రయించేందుకు శుక్రవారం గాంధీచౌక్లోని బంగారు షాపుల సముదాయం వద్దకు వచ్చిన గోపి, అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి 6.25 గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో POCSO, కొట్లాట కేసులు నమోదై కోర్టు విచారణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు.



