త్వరలో మోగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా
కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముస్లిం సమాజం ఎన్నికల్లో నిర్వహించాల్సిన పాత్రపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ అన్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లను సమర్థవంతంగా వినియోగించుకునే విధానంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పరిస్థితుల్లో, రానున్న ఎన్నికల్లో ముస్లిం సమాజం తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా ఉండేలా ఉండాలని సూచించారు.
ఎన్నికల సమయంలో గతంలో మాదిరిగా వివిధ పార్టీలకు మద్దతు ఇవ్వడమా, ఇండియా కూటమికి మద్దతు పలకడమా, లేక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేయడమా అనే అంశాలపై ముస్లిం సమాజం లోతుగా చర్చించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ముస్లిం సమాజం రాజకీయ రంగంలో క్రమంగా వెనుకబడుతోందని, ముస్లిం సమస్యలపై తమ ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో అది అరణ్య రోదనగానే మిగిలిపోతోందని పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సమాజానికి చెందిన మేధావులు, మత పెద్దలు, మత నాయకులు, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారు సమావేశమై స్థానిక పరిస్థితులపై చర్చించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం సమాజ రాజకీయ కార్యాచరణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సయ్యద్ సలావుద్దీన్ పిలుపునిచ్చారు.
ఇట్లు:
సయ్యద్ సలావుద్దీన్
ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు



