బీసీల రిజర్వేషన్ల పెంపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్
కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్ కార్యాలయంలో బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో 33.33 శాతం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, తదుపరి జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేసి టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చేల్లో రవి, బెస్త సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు, హరికృష్ణ, ముదిరాజు సంఘం అధ్యక్షుడు ఓబయ్యతో పాటు పలువురు బీసీ కుల సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.



