సత్యవేడు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేతల బృందం మంగళవారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు కీలక నేతలు కిలారి రాజేష్, అశోక్ బాబు, శ్రీనివాసులు రెడ్డిని ఆత్మీయంగా కలిశారు.
సీనియర్ నేతలు రామాంజులు నాయుడు, గోపిరెడ్డి, జయరాం రెడ్డి,ఇళంగోవన్ రెడ్డి, నరేంద్ర,లోకయ్య రెడ్డి, ఈశ్వర్,రవి రెడ్డి, కరుణాకర్ నాయుడు, కొండూరు బాలరాజు, నాగరాజు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత అంశాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సత్యవేడు టీడీపీ నేతలు తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని అధిష్టానం సూచించినట్లు వారు వెల్లడించారు.
అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించినట్లు సత్యవేడు టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. అధిష్టానం సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచుకుని ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.


