ముథోల్, ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి ):తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ముథోల్ మండల కేంద్రంలోని రబీంద్ర ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకోగా విద్యార్థులు పోతరాజుల వేషాలతో సందడి చేశారు. బ్యాండు మేళాలు, సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన విద్యార్థులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ అసంవర్ సాయినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, చైర్మన్ భీంరావ్ దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ప్లే స్కూల్ ఇన్చార్జి హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



