ఆత్మకూరు, జూలై 7 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సమస్యపై ఇటీవల వస్తున్న కథనాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ స్పందించారు. సోమశిల జలాశయం నుంచి ఆత్మకూరు పట్టణానికి నిరంతరం సరఫరా అవుతున్న మంచినీటి వ్యవస్థలో, సోమశిల ఉత్తర కాలువకు మరమ్మతులు చేపట్టడం వల్ల తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు.కాలువలో మరమ్మతుల పనుల కారణంగా కొద్దిరోజుల పాటు నీటి సమస్య నెలకొన్న మాట వాస్తవమేనని పేర్కొన్న ఆయన, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వెంటనే చర్యలు చేపట్టామని వెల్లడించారు. అదనపు మోటారును ఏర్పాటు చేయడంతో పాటు కొత్త ట్రాన్స్ఫార్మర్ను అమర్చి నీటి సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు.ప్రస్తుతం ఆత్మకూరు పట్టణంలో తాగునీటి సరఫరా సజావుగా కొనసాగుతోందని కమిషనర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా సమస్య ఉంటే ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే ట్యాంకర్లను పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గత రెండు రోజులుగా తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందిని అర్థం చేసుకుని సహకరించిన ఆత్మకూరు పట్టణ ప్రజలకు కమిషనర్ గంగాప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


